మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామం లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చెరువులో శవాలుగా కనిపించారు. మృతులు పంతంగి కృష్ణ (60), సీతా(55) గా స్థానికులు గుర్తించారు. ఈ రోజు తెల్లవారు జామున పొలానికి వెళ్తున్న రైతులు గ్రామ శివారులోని రావి చెరువులో రెండు మృతదేహాలను గుర్తించి పోలీస్ లకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు మృతదేహాలను స్థానికులు సహాయం తో బయటకు తీశారు. అయితే కృష్ణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆటో కూడా మరమ్మత్తులకు గురవటం తో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఇద్దరు గ్రామ శివారులోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతి చెందిన దంపతులు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న దృశ్యం ఓ షాపు ఎదురుగా ఉన్న సీసీ టివి లో నమోదు అయింది.
