మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 27/01/2025 సోమవారం). ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అంకితం చేశారు.
జనవరి 26 న బ్యాంకులకు సెలవు రోజు అయినందున అర్థరాత్రి తర్వాత రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బు జమవుతుందని చెప్పారు.
🔸 నారాయణపేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంక్షేమ పథకాలను పలువురు ఎంపికైన లబ్దిదారులకు పత్రాలను అందించడం ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.
🔸 ప్రజా పాలన అంటే అధికార యంత్రాంగం ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత, ప్రజా సమస్యలను పరిష్కరించి, ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించాలి. అందుకే అధికారులను గ్రామాలకు పంపించాం. ఈరోజు రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, పేదల ఇండ్లకు ఉచిత కరెంట్, వ్యవసాయనికి ఉచిత కరెంట్, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, రైతు రుణమాఫీ, ఏ కార్యక్రమమైనా అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు.
🔸 అధికారులు వచ్చిందే మీ సమస్యలు తెలుసుకోవడానికి. కానీ కొందరు కావాలని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు పూర్తి వివరాలు ఇవ్వండి. వాటన్నింటినీ క్రోడీకరించి సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది.
🔸 మార్చి 31 లోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ లో 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. ఇందుకు ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
🔸 రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, రూ. 500 లకే సిలిండర్, పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు సరిపోవు. పేదవారిని ఇంకా ఆదుకోవాలన్న ఆలోచనతోనే కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం.
🔸 ఏటా 20 వేల కోట్ల రూపాయలతో రైతు భరోసా కింద ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. భూమి లేని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీనవర్గాలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కింద ఏటా 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ పథకం కింద దాదాపు 10 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది.
🔸 గత పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అధికారులెవరూ గ్రామాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ప్రజా పాలనలో అధికారులను గ్రామాలకు పంపించి గ్రామసభలు పెట్టి వివరాలు సేకరించమన్నాం. ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పకుండా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం.
🔸 కొత్త సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.