మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం). గురుకులాల పనివేళలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుకూలంగా శాస్త్రీయంగా నిర్ణయించాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి డిమాండ్ చేశారు.
గురువారం టిఎస్ యుటిఎఫ్ మరియు టి. పి. టి.ఎఫ్ ఆధ్వర్యంలో పెనుబల్లి మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తామన్న హామీని మోడల్ స్కూల్స్, గురుకులాల్లో అమలు జరగడం లేదన్నారు. రెండేళ్ళుగా ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, మెడికల్ రీయింబర్స్ మెంట్, జిపిఎఫ్, జిఎల్ఐ తదితర బకాయిలు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఇకుబేర్ లో పెండింగ్ లో ఉన్నాయని, రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ, కమ్యుటేషన్ తదతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సర కాలంగా విడుదల కాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం మండల కేంద్రంలో జి. వీరస్వామి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆదర్శంవంతమైన పనితీరు కనబరిచిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ని మరోసారి ఎమ్మెల్సీ గా అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
