మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/03/2025 శుక్రవారం). ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
♦️పెనుబల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 15నెలలు పూర్తి చేసుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చామని ఇందుకు గాను ఇప్పటి వరకు 5,450 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని పేర్కొన్నారు.
♦️రూ. 20,676కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. ఏడాదిలోనే 56వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. రూ. 500కే గ్యాస్ అందిస్తున్నామని, తాజాగా మూడు రోజుల క్రితం రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో నూతన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ఒక్కో నియోజక వర్గంలో సుమారు 4000మందికి పైగా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం దొరుకుతుందని తెలియజేశారు.
♦️ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 7లక్షల కోట్లకు పైగా అప్పులకు ప్రతినెల రూ. 6500 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని తెలిపారు. ఆ కారణంగానే కొన్ని హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని, తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.
♦️రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు పేదలకు ఇవ్వడం లక్ష్యమని, తొలి విడతలో ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు ఇచ్చామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500బోనస్ కూడా ఇచ్చామని తెలిపారు. ఇన్ని చేస్తున్నా ప్రతి పక్షాలు ఓర్వలేక తమ పై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. రామచంద్రపురంలో కొంతమంది రైతులు కొన్నిళ్లుగా ప్రభుత్వ అటవీ భూమిని సాగుచేసుకుంటున్నారని వాటికి ప్రభుత్వం తరుపున చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టేకులపల్లి గ్రామంలో అవిరామ్ ఫ్యూయల్ సర్వీస్ స్టేషన్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు ఎఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి పట్టణ, నియోజకవర్గం 5 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, 5 మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
